న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డైరక్టర్ బల్రామ్ భార్గవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిపై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రెండు దశల్లోనూ 70 శాతం మంది కరోనా సోకినవారిలో ఎక్కువగా 40 ఏళ్లు దాటినవారే ఉన్నారని తెలిపారు. తొలి వేవ్లో కానీ, రెండవ వేవ్లో కానీ.. కరోనా వైరస్ సంక్రమించిన వారిలో 70 శాతం మంది 40 ఏళ్ల వయసు దాటిన వారే ఉన్నట్లు చెప్పారు. అయితే రెండవ వేవ్లో ఎక్కువ శాతం కేసుల్లో ఆక్సిజన్ అవసరం వచ్చిందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో మరణాల సంఖ్యలో పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. రెండవ వేవ్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నా.. మరణాల సంఖ్య తక్కువగానే ఉందన్నారు.
ప్రజల్లో తీవ్ర నిర్లక్ష్యం ఉన్నదని, కోవిడ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘిస్తున్నారని ఆయన అన్నారు. గుర్తులేని మ్యుటేషన్ల వల్ల కూడా కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు ఆరోపించారు. యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా వేరియంట్లు అధిక స్థాయిలో వ్యాపిస్తున్నట్లు బల్రామ్ భార్గవ్ వెల్లడించారు. భారత్లో ఓ డబుల్ మ్యూటెంట్ను గుర్తించామని, అయితే ఆ మ్యూటెంట్ ఎంత వేగంగా విస్తరిస్తుందో ఇంకా గుర్తించలేదన్నారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష అత్యంత కచ్చితమైందని, ఈ పరీక్ష ద్వారా రెండు జన్యువులను లేదా అంత కన్నా ఎక్కువే పరిశీలిస్తామని, ఈ పరీక్ష వల్ల ఎటువంటి మ్యూటెంట్లను అయినా డిటెక్ట్ చేస్తామన్నారు.