న్యూఢిల్లీ, జూలై 7: కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ముందుగానే ఊహించినప్పటికీ.. సీనియర్ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్, రమేశ్ పోఖ్రియాల్ రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నలుగురు సహా మొత్తం 12 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెంటనే ఆమోదించారు. రాజీనామా చేసినవారిలో ఆరుగురు క్యాబినెట్ మంత్రులు, ఆరుగురు సహాయ మంత్రులు ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ను ఊహించడంలో, కట్టడికి చర్యలు తీసుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలం అయిందని జాతీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకొన్నది. మరోవైపు, కొత్త ఐటీ రూల్స్తో ట్విట్టర్, కేంద్రప్రభుత్వం మధ్య విభేధాలు కొనసాగుతుండగానే ఆ శాఖ మంత్రి మార్పు జరుగడం విశేషం. ఇక, ఓటీటీలు, డిజిటల్ మీడియాపై ఆంక్షలు తదితర కీలక నిర్ణయాల్లో భాగస్వామి అయిన సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ను కూడా ఆ శాఖ నుంచి తప్పించారు. కేంద్రవిద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ హయాంలో నూతన విద్యావిధానానికి రూపకల్పన జరగ్గా ప్రస్తుతం ఆ శాఖ నుంచి ఆయనను తప్పించారు.
వైఫల్యాన్ని కేంద్రం ఒప్పుకొన్నది: చిదంబరం
న్యూఢిల్లీ: తాము కరోనాను నియంత్రించలేకపోయామని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ రాజీనామా ద్వారా కేంద్రం స్పష్టంగా ఒప్పుకొన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. ఘనతలను ప్రధాని మోదీ తన ఖాతాలో వేసుకొంటారని, వైఫల్యాలను మంత్రుల మీదకు తోసేస్తారని అన్నారు. ‘హర్షవర్ధన్ బలిపశువు’ అని మరో సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.