ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అభివృద్ధి మంత్రాన్ని జపించడం పరిపాటి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధిని 24*7 కొనసాగించడమనేది అత్యాశే. కానీ తెలంగాణ సర్కారు గతానికి భిన్నంగా హైదరాబాద్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. గత ఆరేండ్లకు పైగా రూ.67,035.16 కోట్ల పనులతో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు సమకూర్చింది. వాస్తవంగా గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ను కాసులు కురిపించే బంగారు బాతుగానే పరిగణించి.. వచ్చినకాడికి పిండుకున్నారు. కానీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత దేశంలోని ఏ ఇతర మెట్రో నగరాల్లో లేనివిధంగా మౌలిక సదుపాయాల కల్పనతో నగరంలో సమగ్రాభివృద్ధి జరిగింది. దీంతో నగరవాసుల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు.. కొన్ని పనులు శాశ్వత ఆస్తులు (పర్మినెంట్ అసెట్స్)గా మారాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో గత ఆరేండ్లకు పైగా నగరంలో ప్రణాళికాబద్ధంగా సాగుతున్న అభివృద్ధిని పరిశీలిస్తే…
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే క్రమంలో భాగంగా చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు 18 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. రూ.1010.77కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తయిన ఈ పనుల్లో తొమ్మిది ఫ్లై ఓవర్లు, నాలుగు అండర్పాస్లు, మూడు ఆర్వోబీలు, ఒక కేబుల్ బిడ్జ్రి ఉన్నాయి..