డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది ( IMD warning ). ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీచేసింది. అదేవిధంగా భారీ వర్షసూచన నేపథ్యంలో అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ సర్కారు అప్రమత్తమైంది. రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సర్వసన్నద్ధంగా ఉండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో చమోలీ జిల్లా అధికారులు బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు. యాత్రికులంతా జోషి మఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ జిల్లా కలెక్టర్ రాజేష్ కుమార్ సూచించారు.