ఎఫ్డీసీ ఆదాయం పెంపునకు చర్యలు
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు హరిత తెలంగాణకు కృషి
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
గజ్వేల్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణతోపాటు ఆదాయం పెంచుకునే విధంగా అటవీ అభివృద్ధి సంస్థ పనిచేస్తున్నదని ఆ సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, జనరల్ మేనేజర్ రవీందర్రెడ్డి శనివారం సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల ఎదురుగా ఉన్న అటవీ అభివృద్ధి సం స్థకు చెందిన భూముల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, భూమిపై ఉన్న ప్రతి ప్రాణికి ఆక్సిజన్ కావాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ హరిత ప్రేమికుడని, దాదాపు 13వేల గ్రామపంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి గ్రామాలను వృక్షాలతో అందంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. నీలగిరి చెట్లతో నీరు నిల్వ ఉంటుందన్న ప్రజల్లో పేరుకుపోయిన ఆలోచనలను పూర్తిగా మార్చివేస్తూ, అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అడవుల్లో సంపద సృష్టిస్తున్నామని తెలిపారు. అడవుల్లో ఇప్పటివరకు పెంచిన నీలగిరి చెట్లను తొలగించి విలువైన కలపనిచ్చే శ్రీగంధం, టేకు, వెదురు తదితర చెట్లను పెంచుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అడవులన్నింటనీ గొప్పగా అభివృద్ధి చేయడానికి ఎఫ్డీసీ ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు.