న్యూఢిల్లీ: జలియన్వాలా బాగ్ స్మారక పునర్ నిర్మాణం వివాదాస్పదమవుతుంది. స్మారకం వద్ద లైట్ షో నిర్వహించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) స్పందించారు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం చేయనివాళ్లు.. దీన్ని అర్థం చేసుకోలేరిన ఆయన ఇంగ్లీష్లో ఓ ట్వీట్ చేశారు. హిందూలోనూ ఓ ట్వీట్ చేసిన రాహుల్.. జలియన్వాలా బాగ్ అమరవీరులను అవమానించారని, అమరవీరులంటే తెలియనవాళ్లు మాత్రమే అలా చేస్తారని, తాను ఓ అమరుడి కుమారున్ని అని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని అన్నారు. లైట్ షోను రాహుల్ క్రూరత్వంతో పోల్చారు.
102 ఏళ్ల క్రితం జలియన్వాలా బాగ్లో శాంతియుతంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనపై బ్రిటీష్ జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించారు. ఆ కాల్పుల్లో వెయ్యి మందికిపైగా మరణించారు. ఆ ఘటన జరిగిన ప్రదేశం వద్ద స్మారకం నిర్మించారు. ఆ స్మారకం వద్ద తాజాగా లైట్ షోను ఏర్పాటు చేయడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొననివారు మాత్రమే ఇలాంటి స్కామ్ చేస్తారని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. స్మారకం వద్ద డిస్కో లైట్లు పెట్టడం మర్యాదపూర్వకం కాదు అని, అది జలియన్వాలా బాగ్ తీవ్రతను ఓ వినోదంగా మారుస్తుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ తెలిపారు.