కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు తరచుగా ఫోన్స్కాల్స్తో పాటు అసభ్యకరమైన మెసేజ్లు వస్తున్నాయి. ఫోన్లో మాట్లాడినప్పుడు అతడి గొంతు మైనర్గా ఉందని గుర్తించి.. పట్టించుకోలేదు. అయితే వేధింపులు 6 నెలల నుంచి కొనసాగుతుండటంతో ఆమె కూకట్పల్లి షీ టీమ్స్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. కూకట్పల్లి షీ టీమ్స్ అతడితో ఫోన్లో మాట్లాడగా అతడు షీ టీమ్స్ టీమ్ లీడర్ను కూడా వేధించాడు. దీంతో షీ టీమ్స్ అతడి ఫోన్ నంబర్ వాట్సాప్ డీపీలో బైక్పై ఉన్నట్లు గుర్తించి.. ఆ బైక్ నంబర్ ఆధారంగా వేధిస్తున్న మైనర్… వర్గల్ మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన 14 సంవత్సరాల బాలుడని గుర్తించి.. అతని వ్యవహారాన్ని గ్రామ సర్పంచ్కు వివరించారు. అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి.. ప్రవర్తనలో మార్పు తెచ్చారు. అతను టార్గెట్ చేసిన మహిళను వేధించేందుకు ఆ గ్రామంలోని యువకులందరికీ ఆమె ఫోన్ నంబర్ ఇచ్చి అసభ్యకరంగా మాట్లాడాలని చెప్పినట్లు దర్యాప్తులో తేలింది. ఇలా మహిళలతో అభ్యంతకరంగా వ్యవహరించిన వారిపై షీ టీమ్స్ చర్యలు తీసుకుంది.
మహిళలను, యువతులను వెంటపడి వేధిస్తున్నవారిపై సైబరాబాద్ షీ టీమ్స్ కఠినంగా వ్యవరిస్తుంది.. డెకాయ్ ఆపరేషన్లు చేపట్టి పోకిరీలను పట్టుకుంటున్నారు.. ఫోన్లలో వేధిస్తున్నవారిపై నిర్భయ కేసులు నమోదు చేస్తున్నారు.. దీంతో బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆకతాయిలపై ఫిర్యాదులు చేస్తున్నారు.. మార్చిలో వేధింపులపై 156 ఫిర్యాదు రాగా.. 68 కేసులను నమోదు చేశారు. వాటిలో 53 పెట్టి కేసులు, 15 క్రిమినల్ కేసులు నమోదు చేసి.. వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ 106 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణ కోసం 11 షీ టీమ్స్ బృందా లు పనిచేస్తుండగా.. ఇప్పటివరకు 591 డెకాయ్ ఆపరేషన్లు చేపట్టి పోకిరీలను పట్టుకున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే సైబరాబాద్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, హాక్ఐ.. లేదా నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయాలని షీ టీమ్స్ అధికారులు కోరారు.