ఈ ఆర్థిక సంవత్సరానికిగాను డాక్టర్ రెడ్డీస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ, మే 24: దేశీయ ఔషధ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటి, హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను పెట్టుబడి వ్యయంగా దాదాపు రూ.1,000 కోట్లను కేటాయించింది. అయితే ఈ నిధుల వ్యయం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని సంస్థ సీఈవో రెజ్ ఇజ్రాయెలీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రెడ్డీస్ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడులను పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం సంస్థ పెట్టుబడి వ్యయం గతంతో పోల్చితే ఎక్కువగా ఉంటుందా? అన్న ఓ విశ్లేషకుడి ప్రశ్నకు ఇజ్రాయెలీ పైవిధంగా బదులిచ్చారు.
భవిష్యత్తుపై ఆశ..
దేశ, విదేశీ మార్కెట్లను కొవిడ్-19 ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తుపై డాక్టర్ రెడ్డీస్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నిజానికి ప్రస్తుత వ్యాపార పరిస్థితులపై అనిశ్చితి నెలకొన్నా.. తమ సంస్థకున్న బహుళ వృద్ధి మార్గాలతో నిలదొక్కుకోగలమన్న విశ్వాసాన్ని ఇజ్రాయెలీ వెలిబుచ్చారు.
లక్ష్యాలు ఇవే..
ఆర్గానిక్ వ్యాపారాభివృద్ధి, నిధుల సమీకరణ, ఉత్పత్తి పెంపు, బలమైన మార్కెటింగ్ వ్యవస్థ, డిజిటలైజేషన్, విస్తరణలు సంస్థకున్న లక్ష్యాలని సీఈవో ఇజ్రాయెలీ తెలిపారు. దీర్ఘకాలిక వృద్ధి సాధనకు ఆర్గానికేతర వ్యాపారాభివృద్ధికీ పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి సంస్థ నికర మిగులు నగదు నిల్వలు రూ.751 కోట్లుగా ఉన్నాయి. 2020-21 ఆదాయం రూ.18,972 కోట్లుగా ఉన్నది. .