వనపర్తి, మార్చి 22 : మున్సిపాలిటీ పరిధిలోని నివాసగృహాలకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని కల్పించింది. 50శాతం రాయితీ, కరోనా నేపథ్యంలో పాత బకాయిలకు 90శాతం వడ్డీ మినహాయింపు ఇచ్చింది. ఈ అవకాశం మార్చి 31వ తేదీ వరకు ఉంటుందని, వంద శాతం పన్నుల వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ నివాసగృహాలకు 50శాతం రాయితీని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కల్పించే మినహాయింపులకు సంబంధించిన ఫ్లెక్సీలను జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేశారు. నివాస గృహ యజమానులు పన్నును బిల్ కలెక్టర్లకు లేదా మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్లో చెల్లించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ప్రచారంలో ముందంజ
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాలతో కలిపి 10,403పై చిలుకు నివాసగృహాలు, షాపులు 2,822 ఉన్నాయి. దానిలో పది వేలలోపు సంవత్సరానికి ఇంటి పన్ను 9,136 నివాసగృహాలు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ఏటా ఇంటి పన్నుల ద్వారా 5.20కోట్లు రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.2.86కోట్లు పైగా వసూలు అయ్యాయని, ఇంకా 2.33కోట్లు వసూలు కావాల్సి ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆటోలను ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రతి వార్డులో తిప్పుతూ ప్రచారాన్ని చేయడంలో వనపర్తి మున్సిపాలిటీ ముందంజలో ఉన్నారు.
90 శాతం వడ్డీ మినహాయింపు
కరోనా నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిలు ఉన్నటు వంటి గృహాల వడ్డీ నుంచి 90 శాతం మినహాయింపు ప్రభుత్వం కల్పించింది. కేవలం 10 శాతం వడ్డీతో చెల్లించడానికి ఈనెల 31వ తేదీ వరకు ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
వచ్చే సంవత్సరంలో రాయితీ
ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు కంటే ముందు ఇంటి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాయితీ డబ్బులు జమ అవుతాయని, ఈ రాయితీ విషయం తెలియక కొంతమంది డబ్బులు చెల్లించిన వారు ఉన్నారని అధికారులు వివరించారు.