1,125 మెట్రిక్ టన్నుల ఎల్ఎంవో సరఫరా
తెలంగాణకు 118.75 టన్నుల ఆక్సిజన్
ప్రాణవాయువును చేరవేస్తున్న రైల్వేలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో వైరస్ సోకిన వారికి వైద్యంకోసం అందించాల్సిన లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ల (ఎల్ఎంవో) తరలింపులో భారతీయ రైల్వే చురుకుగా చర్యలు తీసుకొంటున్నది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల అవసరాలు తీర్చడానికి ప్రస్తుతం 20 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లను నడుపుతున్నది. ఈ రైళ్ల ప్రయాణంలో అడ్డంకులు రాకుండా ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసింది. ఈ రైళ్ల ద్వారా 76 ట్యాంకర్లతో 1,125 మెట్రిక్ టన్నుల ఎల్ఎంవోని సరఫరా చేశామని సోమవారం రైల్వే అధికారులు తెలిపారు. మరో 27 ట్యాంకర్లలో 422 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లోడుతో ఏడు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు మార్గమధ్యంలో ఉన్నాయని తెలిపింది. తెలంగాణకు అంగూల్ నుంచి 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఆదివారం చేరింది. 118.75 మెట్రిక్ టన్నుల ఎల్ఎంవోతో రెండో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం ఒడిశా నుంచి సికింద్రాబాద్కు చేరుకుంటుంది.