తుక్కు పాలసీపై జెఫరీస్ అంచనా
ముంబై, మార్చి 22: పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తుక్కు (స్క్రాప్) పాలసీని ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశం, లక్ష్యం బాగానే ఉన్నప్పటికీ ఈ పాలసీకి అనుకున్నంత ఆదరణ లభించకపోవచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ తాజా నివేదికలో స్పష్టం చేసింది. తుక్కు పాలసీలో ప్రకటించిన ప్రోత్సాహకాలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి కోసం వాహనదారులు కొత్త వాహనాల కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపకపోవచ్చని ఆ నివేదిక అభిప్రాయపడింది. సాధారణంగా మార్కెట్లో లభ్యమయ్యే కొత్త వాహనాల ధరలో పాత వాహనాల తుక్కు విలువ 2 నుంచి 3 శాతం వరకే ఉంటుంది. ఇప్పుడు కేంద్రం దీన్ని 4-6 శాతానికి పెంచినప్పటికీ కొత్త వాహనం ధరతో పోలిస్తే చాలా తక్కువగానే అనిపిస్తుంది. మరోవైపు వాహనాల తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఆటోమొబైల్ కంపెనీలు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ కూడా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్లు (ఓఈఎం) అదనపు డిస్కౌంట్లు ఇచ్చే పరిస్థితి లేదని జెఫరీస్ పేర్కొన్నది. అంతేకాకుండా దేశంలో 15-20 ఏండ్లు దాటిన పాత వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో వినియోగంలో లేవని తెలిపింది. ఇంత పాత వాహనాలను వాడుతున్నవారు ప్రభుత్వం అందించే 4-6 శాతం ప్రోత్సాహకాల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయడం సాధ్యపడకపోచ్చని, కొంత మందికి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే స్తోమత కూడా ఉండకపోవచ్చని జెఫరీస్ అంచనా వేసింది.