నల్లగొండ, ఏప్రిల్ 10: గడీలు, దొరల పాలన పులివెందులలోనే ఉన్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఎవరి హయాంలో కత్తులు, వేట కొడవళ్లతో దాడులు జరిగాయో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. వారి హయాంలోనే హైదరాబాద్లో చెరువుల కబ్జాలు, అరాచకాలు, మత కల్లోలాలు జరిగాయని, అవన్నీ మర్చిపోయి ఇవ్వాల నీతి వాక్యాలు వల్లిస్తున్నారని పరోక్షంగా షర్మిలనుద్దేశించి అన్నారు. గడీలు, దొరల పాలన ఎక్కడ ఉంది? తెలంగాణలోనా.. పులివెందులలోనా? అని ప్రశ్నించారు. వంద శాతం ప్రజాస్వామ్య పాలన జరుగుతున్న తెలంగాణలో కొన్ని శక్తులు మళ్లీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సాయుధ తెలంగాణ పోరాటం.. 1969 నాటి ఉద్యమం, కేసీఆర్ సారథ్యంలో మలి దశ ఉద్యమం చేసిన ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలను ఎవరూ మోసం చేయలేరని తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారికి తెలంగాణలో స్థానం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతాడని, అలాంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం పనిచేసేటోడు, ఎవరి మీద పడితే వాళ్ల మీద ఆరోపణలు చేస్తే ప్రజలు ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. అభివృద్ధి అనేది తన పంథా.. బ్లాక్ మెయిలింగ్ అనేది రేవంత్రెడ్డి విధానమని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించకపోతే పెయింటింగ్ వేసుకునే వ్యక్తి రేంజ్ రోవర్ కార్లో ఎలా తిరుగుతున్నాడని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఆయనకు తనను విమర్శించే హక్కులేదన్నారు. తాను అభివృద్ధి కోసమే పార్టీ మారానని, ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు.