న్యూఢిల్లీ: దేశంలో ఉన్న బొగ్గు లభ్యతపై ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. జార్ఖండ్లో వివిధ ప్రాంతాల్లో బొగ్గు అందుబాటులో ఉందని, కానీ దాన్ని తొవ్వడం లేదని ఎంపీ నిశీకాంత్ దూబే ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. దానికి మంత్రి జోషి సమాధానం ఇస్తూ.. కోల్ మైనింగ్ కోసం భూ సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందన్నారు. స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరిస్తే, అప్పుడు బొగ్గు ఉత్పత్తి యూనిట్లను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇక బెంగాల్లో బొగ్గు ఎత్తుకెళ్తున్న ఘటనలపై ఆయన స్పందిస్తూ.. శాంతిభద్రతలు రాష్ట్రానికి చెందిన అంశమని, మేం వెంటనే పోలీసులకు ఫిర్యాదు నమోదు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
బొగ్గు రంగంలో సంస్కరణలకు సంబందించి ఎంపీ శంకర్ లాల్వానీ ఓ ప్రశ్న వేశారు. మైనింగ్ రంగంలో ఓపెన్ విధానాన్ని ఆమోదించినట్లు ఆయన చెప్పారు. బొగ్గు దిగుమతిని తగ్గించేందుకు ఏవైనా చర్యలు తీసుకున్నారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుతున్నారా అని అడిగారు. దానికి మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇస్తూ.. కోకింగ్ కోల్ను దిగుమతి చేస్తున్నామని, ఎందుకంటే దేశంలో లభ్యమైన ఆ కోల్లో ఎక్కువగా బూడిద ఉంటోందన్నారు. ఆ తరహా బొగ్గు దిగుమతిని తగ్గించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
మన దేశంలో సుమారు 79 మిలియన్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉందని మంత్రి జోషి తెలిపారు. అయినా మనం బొగ్గును దిగుమతి చేస్తున్నామని, దీనికి కారణం యూపీఏ తప్పుడు విధానాలే అని అన్నారు. ప్రస్తుతం మనం తక్కువ స్థాయిలో బొగ్గును దిగుమతి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రైవేటు రంగం ద్వారా బొగ్గును ఉత్పత్తి చేస్తున్నామని, అలాగే కోల్ ఇండియాను కూడా విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు.