హైదరాబాద్ : నగరంలోని నెహ్రు జూలాజికల్ పార్కులోకి ఆదివారం నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 8.30 గంటలకు జూ పార్క్ పునః ప్రారంభం కానుంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా పార్కులు, జూ పార్కులు మూసే ఉన్నాయి. ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో వాటిని తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు సందర్శకులకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ పీసీసీఎఫ్ శోభ ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లోని జూ పార్కులు, జింకల పార్కులను సందర్శించేవారు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను అనుసరిస్తూ 10 ఏళ్లలోపు చిన్నారులతో పాటు 65 ఏళ్ల పైబడిన వారికి జూలో ప్రవేశాన్ని నిలిపి వేస్తున్నట్లు నెహ్రు జూలాజికల్ పార్క్ అధికారులు తెలిపారు.