న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ డీజీపిక ఇవాళ జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీన హాజరుకావాలంటూ తన నోటీసుల్లో పేర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హింస గురించి మహిళా కమిషన్ సీరియస్గా ఉన్నది. తాము ఫార్వర్డ్ చేసిన ఫిర్యాదులపై డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోనున్నట్లు మహిళా కమిషన్ పేర్కొన్నది. జిల్లాల వారిగా మహిళల పట్ల జరుగుతున్న నేరాల వివరాలను కూడా మహిళా కమిషన్ కోరింది. ఏప్రిల్ 21వ తేదీ తర్వాత నమోదు అయిన ఎఫ్ఐఆర్ల వివరాలను కూడా కమిషన్ అడిగింది. ఈనెల ఆరంభంలో జాతీయ మహిళ కమిషన్కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం బెంగాల్లో పర్యటించింది. ఆ సమయంలో ఆ బృందం రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ను కూడా కలిసింది.
గుండాలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ .. హింసకు పాల్పడుతున్న సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఆ కేసును జూన్ ఏడవ తేదీన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో హింస పెట్రేగిపోవడానికి ప్రభుత్వం, డీజీపీ కారణమంటూ ఆ అఫిడవిట్లో ఆరోపించారు. జస్టిస్ వినీత్ శరణ్, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. బెంగాల్కు చెందిన అయిదుగురు ఈ పిటిషన్ వేశారు. ఎన్నికల తర్వాత బాంబు దాడులు, హత్యలు, గ్యాంగ్ రేప్లు, మహిళలను కించపరచడం, లూటీలు, కిడ్నాప్లు, విధ్వంసాలు, ప్రభుత్వ ఆస్తి నష్టం లాంటి ఘటనలు జరిగినట్లు పిటిషన్లో ఆరోపించారు. సీనియర్ అడ్వకేట్ పింకీ ఆనంద్ ఆ పిటిషనర్ల తరపున వాదిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం గూండాలను స్పాన్సర్ చేస్తున్నట్లు దాంట్లో ఆరోపించారు.
ఎన్నికల తర్వాత చెలరేగిన హింసతో.. బెంగాల్లో భారీ స్థాయిలో వలసలు నమోదు అయినట్లు తెలుస్తోంది. బెంగాల్ ప్రజలు రాష్ట్రం బయట ఉన్న షెల్టర్ హోమ్లు, క్యాంపుల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపారు. గుండాల రాజ్యంతో మానవ వలసలు పెరిగినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.