న్యూఢిల్లీ: ఈ ప్రశ్న అడిగింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమైనదైన ఇంటికే రేషన్ పథకం మరో వారంలో ప్రారంభమవుతుందనగా లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ దానిని నిలిపేశారు. దీనిపై కేజ్రీవాల్ చాలా ఘాటుగా స్పందించారు. పిజ్జా హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు రేషన్ చేస్తే తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. రేషన్ మాఫియాను అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. తమ అనుమతి తీసుకోలేదని కేంద్రం చెబుతున్నదని, నిజానికి చట్టప్రకారం ఇది అవసరం లేకపోయినా తాము మాత్రం ఐదుసార్లు కేంద్రం అనుమతి కోరామని కేజ్రీవాల్ చెప్పారు.
రేషన్ మాఫియాకు చెక్ పెట్టడానికి తొలిసారి ఓ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ వాళ్లు ఎంత శక్తివంతులో చూడండి. దానిని అమలు చేసే వారం ముందు ఆ పథకాన్ని రద్దు చేయించారు అని కేజ్రీవాల్ అన్నారు. ముందుస్తు అనుమతి కోరలేదంటూ శనివారం లెఫ్ట్నెంట్ గవర్నర్ ఈ పథకాన్ని రద్దు చేశారు. కేంద్రం ఆమోదించలేదని, కోర్టు కేసు నడుస్తోందని రెండు చెల్లని కారణాలను అనిల్ బైజాల్ చెప్పారని ఢిల్లీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజనా అనే పేరు పెట్టారు. ఈ పథకంలో భాగంగా బియ్యం, గోధుమ పిండిని అర్హులైన వారికి ఇంటికి నేరుగా సరఫరా చేస్తామని ఆప్ ప్రభుత్వం తెలిపింది.