మహబూబాబాద్ : మహబూబాబాద్లో వైద్య కళాశాలను సరైన సమయంలో నిర్మాణం చేపట్టి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏ రిజ్వీ అన్నారు. జిల్లా కేంద్ర పరిధిలోని శనిగపురం రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 551 లోని సుమారు 48 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల స్థలాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలకు రహదారులున్నాయా…? అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వీపీ.గౌతమ్ బదులిస్తూ ఇటీవల జిల్లాకు సాంక్షన్ అయిన భద్రాద్రి కొత్తగూడెం-హైదరాబాద్ రింగ్ రోడ్ నుంచి వెళ్లే జాతీయ రహదారి ఈ కళాశాలలకు ఆనుకుని వెళ్తుందని, అదేవిధంగా పట్టణం నుంచి ఎస్పీ కార్యాలయానికి వచ్చే రహదారి సైతం దగ్గరే ఉంటుందని తెలిపారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ తో సమావేశమై దీనిపై చర్చించారు. అతి త్వరలో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ గా మారుతుందని, అందుకు కావాల్సిన అన్ని వసతులు, నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు యుద్ధ ప్రాతిపదికన నూతన మెడికల్ కాలేజీ కూడా సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. దానికి కూడా కావాల్సిన అన్ని చర్యలు చేపడుతామని చెప్పారు. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాల నిర్మాణానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందజేస్తానని తెలిపారు.
సమావేశంలో మంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజు, మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రాములు, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి