ఏకగ్రీవంగా ఆమోదించిన అకడమిక్ సెనెట్
అధ్యాపకులను నియమించాలి
రూ.6 కోట్లతో కే హబ్ నిర్మాణం
న్యాక్ గుర్తింపునకు సిద్ధం కావాలి
కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ పీ వరలక్ష్మి
భీమారం, మార్చి 30 : కాకతీయ యూనివర్సిటీ 2021-22 వార్షిక బడ్జెట్ రూ.333.92కోట్ల ప్రతిపాదనలకు అకడమిక్ సెనెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం అకడమిక్ సెనెట్ హాల్లో ప్రొఫెసర్ మహేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ పీ వరలక్ష్మి ఎనిమిది అంశాలతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాబడిరూపంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.90.94 కోట్లు, అంతర్గత నిధుల నుంచి రూ.214.15 కోట్లు, లోటు రూ.28.83 కోట్లుగా పేర్కొన్నారు. ఈ నిధుల్లో ప్రారంభ మూలధనం రూ.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.90.94కోట్లు, యూజీసీ ఏరియర్స్ రూ.32.81కోట్లు, అంతర్గత నిధుల రూపంలో రూ.10.59 కోట్లు, అకడమిక్ ఫీజుల రూపంలో రూ.4.65కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ.63.77 కోట్లు, ఇతర వనరుల నుంచి రూ.28.66 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. రూ.166.31 కోట్లు జీతాలు, పింఛన్లకు, రూ.6.66 కోట్లు నిర్వహణ, పరిపాలన ఖర్చులకు, పరీక్షల నిర్వహణకు రూ.68.95 కోట్లు, అకడమిక్ కార్యక్రమాలకు రూ.6.34 కోట్లు, వివిధ అభివృద్ధి పనులకు రూ.12.09 కోట్లను వ్యయాల కింద ప్రతిపాదించగా, సెనెట్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ప్రొఫెసర్ మహేందర్రెడ్డి గత ఏడాది యూనివర్సిటీ ప్రగతిని వివరించారు.
అధ్యాపకులను నియమించాలి
బడ్జెట్పై మాజీ వీసీ లింగమూర్తి మాట్లాడుతూ.. యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు జరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. మా జీ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న మాట్లాడుతూ.. ఐక్యూఏసీ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. న్యాక్ గుర్తింపునకు సిద్ధం కావాలని సూచించారు. యూనివర్సిటీలోని సెల్లను పునరుద్ధరించాలని, అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని మాజీ వీసీ ప్రొఫెసర్ విద్యావతి కోరారు. కేయూ సెనెట్ మెంబర్ డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందరం కృషి చేయాలన్నారు. పాలక మండలి సభ్యుడు డాక్టర్ మదన్కుమార్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం మాట్లాడుతూ.. అందరి సహకారంతో కాకతీయ యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పాలక మండలి సభ్యుడు నాగేంద్రబాబు, ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ మల్లారెడ్డి, వీ రాజిరెడ్డి, డాక్టర్ సీతారాం, ప్రొఫెసర్ రాజేశ్వర్, డాక్టర్ టీ సుమతి, ఉమామహేశ్వరి, చందర్, మాణిక్యం, బొమ్మాల కట్టయ్య యూనివర్సిటీ అభివృద్ధిపై మాట్లాడారు. అంతకుముందు మాజీ రిజిస్ట్రార్ ఆచార్య రంగారావు మృతికి సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో పీఆర్వో పృథ్వీరాజు, రాజయ్య, వివిధ విభాగాల డీన్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.