న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ చిన్నారులకు ముప్పుగా పరిణమిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో వైరస్ తన స్వభావం మార్చుకుంటే పిల్లలపై అధిక ప్రభావం చూపవచ్చని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. వైరస్ రూపు మార్చుకుంటే రెండు నుంచి మూడు శాతం చిన్నారులు దవాఖానలో చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొనవచ్చని అంచనా వేసింది. థర్డ్ వేవ్ ప్రభావాన్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఈ దిశగా త్వరలో నూతన మార్గదర్శకాలు జారీ చేస్తామని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు.
చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. చిన్నారులకు ఇన్ఫెక్షన్లు సోకినా వాటి లక్షణాలు పెద్దగా ఉండవని, వారికి కొవిడ్ సోకినా తీవ్రత ఉండదని అన్నారు. చిన్నారులపై వైరస్ ప్రభావం లేకుండా చూసేలా అన్ని చర్యలూ చేపడుతున్నామని చెప్పారు. పిల్లలపై వైరస్ తీవ్రత లేకుండా చూసేలా దీటైన ఆరోగ్య, సాంకేతిక మౌలిక వసతులను సమకూరుస్తున్నామని అన్నారు.