స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
పెద్దపల్లి రూరల్, జూన్15: గ్రామపంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని పాలకుర్తి, అంతర్గాం, పెద్దపల్లి మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్దీపక్ మాట్లాడుతూ, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఏప్రిల్ 24 సందర్భంగా కేంద్ర మంత్రిత్వ శాఖ గ్రామపంచాయతీలు, మండల పరిషత్లకు పలు రకాల అవార్డులను ప్రకటిస్తుందని వివరించారు. వాటికి గ్రామపంచాయతీలు, మండల పరిషత్ అర్హత సాధించేలా తీర్చి దిద్దాలని సూచించారు. జిల్లా శిక్షకులు సురేందర్ ప్రభుత్వం ప్రకటించే అవార్డులకు సంబంధించిన అంశాల్లో వ్యవహరించాల్సిన విధానాలను వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీధర్, డీపీవో చంద్రమౌళి, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి వెంకట్నారాయణ, అధికారులు తదితరులు ఉన్నారు.
మంథని బల్దియా సందర్శన
మంథని టౌన్, జూన్ 15: మంథని మున్సిపల్ కార్యాలయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో చైర్ పర్సన్ పుట్ట శైలజ, పాలకవర్గం సభ్యులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మంథనిలో నిర్మించనున్న ఇంటిగ్రేటేడ్ మార్కెట్, హరితహారంలో మొక్కలు నాటే ప్రక్రియపై చర్చించారు. అనంతరం కూరగాయల మార్కెట్ను పరిశీలించడంతో పాటు పాత పెట్రోల్ బంకు ఏరియాలోని కాటారం-మంథని ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటేందుకు స్థలాన్ని సందర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే రవి, గర్రెపల్లి సత్యనారాయణ, గుండా విజయలక్ష్మి పాపారావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్కే యాకుబ్, సముద్రాల స్వాతి శ్రీనివాస్, గట్టు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.