వరంగల్ : వరంగల్ ఎంజిఎంలో కరోనా టీకా రెండో డోసును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకున్నారు. ఓపీ రూం నంబర్ 3 లో సంబంధిత సూపరింటెండెంట్, జిల్లా వైద్యాధికారి సమక్షంలో కోవిషీల్డ్ టీకాను మంత్రి తీసుకున్నారు. టీకా తీసుకున్న తర్వాత కొద్ది సేపు అక్కడే ఉన్నారు. ఎంజీఎం హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న టీకాల డోసులు, కరోనా విస్తరిస్తున్నందున బెడ్లు, మందులు, వెంటిలేటర్ వంటి సదుపాయాలను ఎలా ఉన్నాయని ఆరా తీశారు. వాటిని ముందు జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్త పడాలన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలి, మాస్కులు తప్పనిసరిగా వాడాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు వినియోగించని వారిపై జరిమానాలు విధిస్తామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.