భోపాల్: కరోనా పోవాలంటూ ఒక మంత్రి ఎయిర్పోర్ట్లో పూజ చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ శుక్రవారం ఇండోర్ విమానాశ్రయంలోని దేవి అహిల్య బాయి హోల్కర్ విగ్రహం ఎదుట పూజలు చేశారు. కరోనా పోవాలంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ చేతులతో భజన చేశారు. విమానాశ్రయం డైరెక్టర్ ఆర్యమా సన్యాస్, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు మంత్రి ఉషా ఠాకూర్ ఈసారి కూడా మాస్క్ ధరించలేదు. తొలి నుంచి ఆమె మాస్క్ ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. అయితే తాను ప్రతి రోజు పూజలు, హోమాలు చేస్తానని, హనుమాన్ చాలిసాను పఠిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాల్సిన అవసరం తనకు లేదన్నారు. అలాగే ఆవు పేడతో చేసిన పిడకను కాల్చి ఇంట్లో ఉంచితే 12 గంటలపాటు శానిటైజ్ చేస్తుందని గతంలో ఆమె పేర్కొన్నారు.