కర్నాటక : కర్ణాటకలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో భారత వైమానిక దళం తన వంతు చర్యలకు ఉపక్రమించింది. తన వైమానిక దళ కేంద్రంలో 100 పడకల కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. బెంగుళూరు జలహళ్లిలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద 100 పడకల కొవిడ్ కేర్ చికిత్స సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. మే 6వ తేదీ వరకు మొదటగా ఆక్సిజన్ సదుపాయంతో కూడిన 20 పడకలను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. మిగిలిన 80 పడకలను మే 20వ తేదీలోగా అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది.
బెంగళూరు కమాండ్ హాస్పిటర్ ఎయిర్ఫోర్స్ నుండి వైద్యులు, నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. మొత్తం 100 పడకల్లో 10 ఐసీయూ, 40 పైప్డ్ ఆక్సిజన్ బెడ్స్, మిగిలిన 50 పడకలు ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్ను కలిగి ఉన్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. బెంగళూరులో ప్రతిరోజు 20 వేల కరోనా పాజిటివ్ కేసులు, 100 కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి.