తాండూరు, ఏప్రిల్ 19 : తాండూరు సమీపంలోని కాగ్నానది వంతెన నిర్మాణం పూర్తి కావచ్చింది. కాగ్నానదిపై ఉన్న అతిపురాతనమైన వంతెన మూడేండ్ల క్రితం భారీ వర్షం కారణంగా నది ఉద్రిక్తతతో కూలిపోయింది. దీంతో తాండూరు-మహబూబ్నగర్ రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో తాత్కాలిక వంతెన వేశారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఆధునిక టెక్నాలజీతో రూ.16.80కోట్లతో వంతెన నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో చురుకుగా కొనసాగిన పనులు భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం, ఇతర కారణాలతో జాప్యం జరుగడంతో ఏడాదిపాటు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి రైతులతో సంప్రదింపులు చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి కాగ్నానది బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడ తుదిమెరుగులు పూర్తి చేసి త్వరలో బ్రిడ్జిపై నుంచి అధికారికంగా రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని ప్రజలు అభినందిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.