న్యూఢిల్లీ : తూర్పు లడఖ లో పరిస్థితిపై చైనాతో తదుపరి కమాండర్ స్ధాయి చర్చలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ దిశగా సంప్రదింపులు సాగుతున్నాయని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా పేర్కొన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో క్షేత్రస్ధాయి పరిస్థితులకు అనుగుణంగా బలగాల మోహరింపు, చేపట్టాల్సిన మార్పులపై భారత దళాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.
నిర్ధిష్ట ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన సేనల ఉపసంహరణ సహా పలు అంశాలపై తదుపరి చర్చలు ఉంటాయని తెలిపారు. చైనా సరిహద్దుల వద్ద మనవైపు నుంచి అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నామని వాయుసేన చీఫ్ వెల్లడించారు. పొరుగుదేశాల నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత వాయుసేనలో అత్యాధునిక సాంకేతికతను జోడించి బలోపేతం చేస్తున్నామని హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొన్న భదౌరియా పేర్కొన్నారు.