న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కరోనా రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. దేశీయగా ఉత్పత్తిని, సరఫరాను పెంచడంతోపాటు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నది.
ఇందులో భాగంగా సింగపూర్ నుంచి నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కేంద్రం దిగుమతి చేసుకుంటున్నది. వాయు సేనకు చెందిన సీ-17 విమానం శనివారం ఉదయం భారత్ నుంచి సింగపూర్కు వెళ్లింది. నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లతో సాయంత్రానికి పనగఢ్ ఎయిర్బేస్కు చేరుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్తోపాటు యూఏఈ నుంచి కూడా ఆక్సిజన్ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని అధికారులు పేర్కొన్నారు.