చండీగఢ్: పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్పై సిద్ధూ రాజకీయ సలహాదారుడు ముస్తఫా వివాదస్పద ఆరోపణలు చేశారు. అమరీందర్ సింగ్ గత ఐదేండ్లుగా పంజాబ్ను అవమానిస్తున్నారని విమర్శించారు. గత నాలుగున్నర ఏండ్లుగా పార్టీ నేతలు, ప్రజలు ఆయనను సహించారని అన్నారు. తాను పార్టీ నాయకుడిని అయితే, అమరీందర్ను 30 రోజుల్లో పార్టీ నుంచి తొలగిచేవాడినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ దేశద్రోహి అంటూ అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ముస్తఫా ఖండించారు. ‘సిద్ధూ దేశద్రోహి కాదు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సిద్ధూను దేశద్రోహి అని పిలిస్తే, నేను అమరీందర్ చరిత్ర పుస్తకాన్ని తెరుస్తాను. కెప్టెన్ లక్ష్యం సిద్ధూ కాదు, గాంధీ కుటుంబం. గాంధీ కుటుంబాన్ని అమరీందర్ లక్ష్యంగా చేసుకోవడాన్ని నేను అనుమతించను’ అని ఆయన అన్నారు.