కోల్కతా: దేశంలో థర్డ్ వేవ్ విజృంభించనుందన్న వార్తలు గుప్పుమంటున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా స్తబ్దుగా ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. తాను త్వరలోనే ఢిల్లీకి వెళ్తున్నానని, ఓ రెండు మూడు రోజులపాటు తన పర్యటన కొనసాగనుందని ఆమె తెలిపారు. తనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చారని, పర్యటనలో భాగంగా తాను వారితో భేటీ కానున్నానని మమత వెల్లడించారు. వివిధ పార్టీల నాయకుల నుంచి తనకు కలుద్దామని అభ్యర్థనలు వచ్చాయని, వీలైతే వాళ్లందరినీ కలిసే ప్రయత్నం చేస్తానని ఆమె చెప్పారు.