హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో వేయి మంది కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయిన చాలామంది కార్మికులు తిరిగి రావడంతో పనుల్లో వేగం పెరిగింది. ప్రస్తుతం బేస్మెంట్ స్లాబ్ సగం వరకు పూర్తయింది. మిగిలిన సగం ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. పునాదులు, కాంక్రీట్ వర్క్ జరుగుతున్నప్పుడు సచివాలయం షేప్ కనిపించలేదు. ఇప్పుడు బేస్మెంట్స్లాబ్ పనులు సగం వరకు పూర్తవ్వడంతో సచివాలయం భవనం నమూనా తీరుగా కనిపిస్తున్నది. పనుల్లో నాణ్యత ఏమాత్రం తగ్గకుండా ఉండటానికి, పనుల్లో వేగం పెంచడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన సలహాలు ఇస్తున్నారు. నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కృషి చేస్తున్నారు.