గాంధీనగర్: గుజరాత్ బీజేపీలో ఇవాళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ( Vijay Rupani ) తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. విజయ్ రూపానీ రాజీనామా చేసిన వెంటనే గుజరాత్ బీజేపీ ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. ఇదిలావుంటే విజయ్ రూపానీ బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు రాజీనామా చేశారా..? లేదంటే తనంతట తానుగా పదవి నుంచి వైదొలిగారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, రాజీనామా అనంతరం గాంధీనగర్లో మీడియాతో మాట్లాడిన విజయ్ రూపానీ.. ఇన్నాళ్లు తనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం వచ్చిందని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.