జడ్చర్ల టౌన్, మే3: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 27 వార్డులకుగానూ టీఆర్ఎస్ పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకున్నది. మిగతా నాలుగు స్థానాల్లో బీజేపీ 2, కాంగ్రెస్ 2 స్థానాలను దక్కించుకున్నాయి.
బల్దియా ఎన్నికల సైడ్లైట్స్
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 14మంది టీఆర్ఎస్ అభ్యర్థులు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన వారిని గులాబీ పార్టీ అవకాశం కల్పించి టికెట్లు ఇచ్చింది.
18వ వార్డులో మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రచారం మినహా మిగతా వార్డులన్నీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు.
బీజేపీ 5స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. మరో స్థానంలో అభ్యర్థి చివరి నిమిషంలో న్యూట్రల్ అయ్యారు. కాంగ్రెస్ రెండు స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టలేదు.
ఎంఐఎం పార్టీ 7 చోట్ల పోటీపడింది. ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేసినా ఆ పార్టీ ఒక్కస్థానం కూడా గెలువలేదు.
15వ వార్డులో అత్యల్పంగా 52.59 శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ సీనియర్ నాయకుడు పాలాది రామ్మోహన్ టీఆర్ఎస్ పార్టీలో చేరగా అతడి సతీమణి సారికకు టికెట్ కేటాయించారు. దీంతో ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థిపై 307 ఓట్లు మెజార్టీతో ఆమె గెలిచారు.
మున్సిపాలిటీ పరిధిలో అత్యధికంగా 2వ వార్డులో 82.08 శాతం పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సునాయసమైంది.
19వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ నామినేషన్లు వేయలేదు. సీపీఐ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి సాజిదాసుల్తానా 475 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సాజిదా సుల్తానా భర్త ఇఫ్తెకార్ న్యాయవాది కావటంతో అడ్వకేట్లంతా మద్దతు పలికారు.
22వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఓట్లను చీల్చడంతో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీశైలమ్మ విజయం సునాయసమైంది.
23వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాశంకర్గౌడ్ గెలుపులో మైనార్టీ ఓట్లు కీలకమయ్యాయి.
కావేరమ్మపేట పంచాయతీ కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. మున్సిపాలిటీలో విలీనం కాగా 3 వార్డుల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది.
10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిపై కేవలం 24 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడు.
18వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిపై కేవలం 21 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాడు.