కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రం ప్రతీదాన్ని హ్యాక్ చేస్తుందని, అందుకే తన ఫోన్కు తాను ప్లాస్టర్ వేసుకున్నానని ఆమె చెప్పారు. వీడియోను, ఆడియోను కూడా ట్యాప్ చేస్తున్నారని, అందుకే తాను ఫోన్కు ప్లాస్టర్ వేసుకున్నట్లు చెబుతూ తన ఫోన్ను చూపించారు. ఫోన్ల హ్యాకింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. పెగాసస్ చాలా ప్రమాదకరం. వాళ్లు వ్యక్తులను హింసిస్తున్నారు. కొన్నిసార్లు నేను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. ఢిల్లీ లేదా ఒడిశా చీఫ్ మినిస్టర్లతో మాట్లాడలేకపోతున్నానని ఆమె అన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. దేశాన్ని ఓ నిఘా కేంద్రంగా చేయాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. దీనికి బీజేపీయే కారణం. వాళ్లు తమ మంత్రులనే విశ్వసించడం లేదు. వాళ్లు అన్ని ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు అని మమత విమర్శించారు. దేశంలో స్పైగిరి నడుస్తోంది. జడ్జీలు, మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. వాళ్లు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్మూలించారు. పెగాసస్ మొత్తం ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మంత్రులు, మీడియాల సమాచారాన్ని రాబట్టింది. దీన్ని ప్రజాస్వామ్యం దేశం నుంచి నిఘా దేశంగా మార్చాలని అనుకుంటున్నారు అని మమత అన్నారు.