కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుధవారం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెకు ఓ బలమైన సందేశం పంపించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆమెను అభినందిస్తూనే.. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింస గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా జగ్దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్జెంటుగా సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నా చెల్లెలు మమతా బెనర్జీ ఆ పని చేస్తారన్న నమ్మకం నాకు ఉంది అని జగ్దీప్ ధన్కర్ అనడం గమనార్హం.
మీరు పక్షపాత ప్రయోజనాలను పక్కనపెడతారని, పాలనలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తారని భావిస్తున్నట్లు గవర్నర్ జగ్దీప్ అన్నారు. బెంగాల్లో ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. 292 స్థానాలకు కౌంటింగ్ జరగగా.. 213 స్థానాల్లో గెలిచి తృణమూల్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ వెంటనే బెంగాల్లో హింస చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇందులో 12 మంది మృత్యువాత పడ్డారు.