బాన్సువాడ/ఎల్లారెడ్డి రూరల్/ లింగంపేట/ మద్నూర్/ తాడ్వాయి/ గాంధారి/ మాచారెడ్డి/ సదాశివనగర్/పిట్లం/బీబీపేట్/విద్యానగర్, మే 14 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడం, ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ముస్లిములు రంజాన్ పండుగను శుక్రవారం సాదాసీదాగా నిర్వహించుకున్నారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిములు గురువారం రాత్రి నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలను విరమించారు. కరోనా వైరస్ కట్టడి కోసం కలిసి కట్టుగా ప్రత్యేక ప్రార్థనలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఇండ్లలోనే నమాజ్ చేసుకున్నారు. అనంతరం బంధువులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా నేపథ్యంలో లింగంపేట మండలంలోని పెద్దవాగు సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయకపోవడంతో ఈద్గా ప్రాంతం బోసిపోయింది.
ఎల్లారెడ్డి పట్టణంలో ప్రశాంతంగా రంజాన్ పండుగ జరిగింది. ఇండ్లకు సమీపంలో ఉన్న మసీదులు, దర్గాల వద్ద పలువురు కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.గాంధారి మండలకేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ముస్లిములు రంజాన్ పండుగను సాదాసీదాగా జరుపుకొన్నారు. లాక్డౌన్ కారణంగా ఈద్గాల వద్ద రంజాన్ ప్రార్థనలకు అనుమతి లేకపోవడంతో తమ తమ ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలకేంద్రంలోని జామా మసీదులో పరిమిత సంఖ్యలో ముస్లిములు కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మాచారెడ్డి మండలవ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిములు నిరాడంబరంగా జరుపుకొన్నారు. కామారెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్ షేక్ అజీజ్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాచారెడ్డి మండల కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖాన్, షౌకత్ అలీ, అశ్వాఖ్, ఆరిఫ్, సల్మాన్, గ్యార సాయిలు తదితరులు పాల్గొన్నారు.సదాశివనగర్ మండలకేంద్రంతోపాటు అడ్లూర్ ఎల్లారెడ్డి, పద్మాజివాడి, కల్వరాల్, ధర్మారావుపేట్, కుప్రియాల్, భూంపల్లి గ్రామాల్లో రంజాన్ వేడుకలను ముస్లిములు సాదాసీదాగా జరుపుకొన్నారు. శుక్రవారం ఉదయం కొత్త బట్టలు ధరించి గ్రామ శివారుల్లో ఉన్న ఈద్గాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పిట్లం మండలకేంద్రంలోని జామా మసీదులో ముస్లిం మత గురువు జంషెద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని అల్లాహ్ను వేడుకున్నామని మత పెద్ద తెలిపారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సూతరి రమేశ్ మాజీ మంత్రి షబ్బీర్అలీని శాలువాతో సన్మానించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.