రాయ్పూర్: తమ పార్టీ కార్యకర్తలు ఉమ్మితే ఆ ఉమ్ములో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం కొట్టుకుపోతాయంటూ గురువారం బీజేపీ నాయకురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రెండు పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా పురందేశ్వరి వ్యాఖ్యలపై స్పందించారు. పురందేశ్వరి వ్యాఖ్యలు ఆమెనే చిక్కుల్లో పడేశాయని, ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని తాను ఊహించలేదని పేర్కొన్నారు. ఎవరైనా సరే ఆకాశం వైపు ఉమ్మితే, అది తిరిగి వాళ్ల ముఖంపైనే పడుతుందని ఎద్దేవా చేశారు.
గురువారం బస్తర్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పురందేశ్వరి.. 2023 ఎన్నికల కోసం మీరంతా కలిసికట్టుగా పనిచేయాలని, మీరు కష్టపడి పనిచేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంతటితో ఆగకుండా మీరంతా ఒక్కసారి వెనక్కి తిరిగి ఉమ్మితే ఆ ఉమ్ములో భూపేష్ బఘేల్, ఆయన మంత్రివర్గం పూర్తిగా కొట్టుకుపోతారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భూపేష్ బఘేల్ కౌంటర్ ఇచ్చారు.