హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యోధులు వారు.. ఆ వైరస్ తమను మింగేస్తుందని తెలిసినా వెన్నుచూపని మహాధీరులు వారు. అలాంటి కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన పోలీసులు, వైద్యసిబ్బంది, జర్నలిస్టులకు బీమా కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. కొవిడ్ నేపథ్యంలో లైఫ్ పాలసీ, హెల్త్ పాలసీ ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. నిబంధనల సాకులు, వైద్యపరీక్షల పేరుతో వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికే తీసుకున్న పాలసీ మొత్తం సైతం ఎగవేసేందుకు కుట్రలు పన్నుతున్నాయి.
టెక్నికల్ అంశాలతో తప్పించుకొంటూ..
కష్టకాలంలో ఆదుకుంటాయని భావించిన హెల్త్ పాలసీలపై బీమా కంపెనీలు వెయిటింగ్ పీరియడ్ అంటూ కొత్తరాగం అందుకుంటున్నాయి. సాధారణంగా బీమాలో హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు ప్రధానంగా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న వెంటనే అది అమలులోకి రాదు. నిర్ణీత కాలపరిమితి తర్వాతే పాలసీ కవర్ చేసుకొనే వీలుంటుంది. అండర్ రైటింగ్ పేరుతో కంపెనీలు ఆ పాలసీని మూడు నెలల నుంచి ఏడాది వరకు పెండింగ్ పెట్టే అవకాశముంటుంది. పాలసీదారుడికి అదనపు వైద్యపరీక్షలు నిర్వహించే అవకాశమున్నది. పాలసీదారులు తనకున్న వ్యాధులను ముందస్తుగానే వెల్లడించాల్సి ఉంటుంది. వ్యాధులను దాచి పాలసీ సొమ్మును పొందాలంటే కుదిరేపని కాదు. మరోవైపు జీవిత బీమా పాలసీలకు ఇలాంటి ప్రక్రియ ఉండదు. 35 ఏండ్లలోపువారు లైఫ్ టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. నామమాత్రపు వైద్యపరీక్షలు మాత్రమే చేస్తుంటారు.
ప్రస్తుతం కొన్ని కంపెనీలు కొవిడ్ నేపథ్యంలో పాలసీల నిబంధనలను కఠినతరం చేశాయి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సైతం వెయిటింగ్ పీరియడ్ను అమలు చేస్తున్నాయి. పెద్దమొత్తంలో లైఫ్ టర్మ్ పాలసీలను ఇచ్చేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఫ్రంట్లైన్ వారియర్స్గా సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులకు పాలసీలు ఇచ్చేందుకు వెనకంజ వేస్తున్నాయి. ఇప్పటికే పాలసీలు తీసుకున్నవారికి అదనపు పరీక్షలు చేయించుకోవాలని సందేశాలు పంపుతున్నాయి. కొన్నిసార్లు అండర్రైటింగ్ పేరిట పాలసీలను దీర్ఘకాలం పెండింగ్ పెడుతుండటంతో తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తుతున్నది. ముంబైకి చెందిన ఓ డాక్టర్ ఆరునెలల క్రితం రూ.3.5 కోట్ల టర్మ్ పాలసీని తీసుకున్నారు. ఇటీవల ఆయనకు పాలసీ మొత్తాన్ని రూ.కోటికి కుదిస్తూ అదనపు వైద్యపరీక్షలు సైతం చేయించుకోవాలంటూ సందేశం పంపింది. దీనిని బట్టి పాలసీదారుల పట్ల బీమా కంపెనీల ఎగవేత వ్యవహారశైలి స్పష్టమవుతున్నది. కొవిడ్ బారిన పడి కొలుకున్నవారికి సైతం పాలసీ ఇవ్వకుండా వెయింటింగ్ పీరియడ్లో పెడుతుండటం గమనార్హం.
ైక్లెయిమ్ల చెల్లింపునకూ కొర్రీలు
బీమా కంపెనీలు తమ పాలసీదారులకు ైక్లెయిమ్లను చెల్లించేందుకు సైతం కొర్రీలు పెడుతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో చాలా ప్రైవేటు దవాఖానలు ఇష్టారాజ్యంగా బిల్లులను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపు వసూలుచేస్తున్నాయి. ఆ బిల్లుల మొత్తాన్ని చెల్లించేందుకు బీమా కంపెనీలు నిరాకరిస్తున్నాయి. వ్యాక్సిన్కు ప్రభుత్వం నిర్ణయించిన 2,300 ధరతో, ఇన్పేషెంట్ వార్డ్ చార్జీలను సైతం రోజుకు రూ.5,000కు మించి చెల్లించబోమంటూ స్పష్టంచేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు కొవిడ్ బిల్లులను పాలసీదారులే చెల్లించుకోవాలని చెప్తుండటంతో పాలసీదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.