లండన్: క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ మళ్లీ పుంజుకున్నది. తాజాగా బిట్ కాయిన్ విలువ 39వేల డాలర్లు దాటింది. పర్యావరణ హిత ఇంధనంతో మైనింగ్ జరిపినప్పుడు భవిష్యత్లో క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు జరుపుతామని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్మస్క్ ట్వీట్ చేశారు.
కనీసం 50 శాతం క్లీన్ ఎనర్జీతో బిట్ కాయిన్ మైనింగ్ జరిపితే దాంతో లావాదేవీలు జరుపుతామన్నారు. దీంతో న్యూయార్క్లో ఆదివారం మధ్యాహ్నం బిట్ కాయిన్ విలువ 9.3% పుంజుకున్నది.
39,372 డాలర్ల వద్ద ట్రేడయింది. ఈ నెల మూడో తేదీన 40 వేల డాలర్ల దిగువకు పడిపోయాక ఇదే అత్యధికం. హాంకాంగ్ మార్కెట్లో సోమవారం ఉదయం ఏడు గంటలకు ఒక శాతం నష్టపోయి 38,881 డాలర్ల వద్ద స్థిర పడింది.
ఇటీవలి బిట్ కాయిన్ లావాదేవీల విషయమై ఎలన్మస్క్ ట్వీట్లపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్తో దర్యాప్తు చేయించాలని సౌతాఫ్రికా సైబర్ టెక్నాలజీ సంస్థ సైగ్నియా ఎగ్జిక్యూటివ్ మాగ్డా వైర్జియ్కా పేర్కొన్నారు.
గత ఫిబ్రవరిలో తమ కార్ల విక్రయాలకు బిట్ కాయిన్ పేమెంట్స్ను అంగీకరిస్తామని ఎలన్మస్క్ చేసిన ట్వీట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బిట్ కాయిన్లో టెస్లా 150 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు మస్క్ తెలిపారు. దీంతో బిట్ కాయిన్తోపాటు ఇతర క్రిప్టో కరెన్సీలు పైపైకి దూసుకెళ్లాయి.
కాయిన్మార్కెట్ డాట్ కామ్ ఇండెక్స్ ప్రకారం సోమవారం ఉదయం 7.20 గంటలకు 39,209.54 డాలర్ల (9.60 శాతం) వద్ద బిట్ కాయిన్ ట్రేడయింది. జూన్ తొమ్మిది తర్వాత ఒక్క రోజులో బిట్ కాయిన్ ఎక్కువగా లబ్ధి పొందడం ఇదే తొలిసారి.
బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 733 బిలియన్ల డాలర్లు. మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఇది 45 శాతం పై చిలుకు. గత ఏడు రోజుల్లో బిట్ కాయిన్ ఏడు శాతానికి పైగా లాభ పడింది. అయినా ఏప్రిల్ 14న నమోదైన ఆల్టైం రికార్డ్ 64,778.04 డాలర్లతో పోలిస్తే బిట్ కాయిన్ ఇంకా 40 శాతం దిగువనే ఉంది.
ఏథర్ 3.83 శాతం పుంజుకుని 2,502.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బినాన్స్ కాయిన్ 4.69 శాతం లబ్ధి పొంది 365.26 డాలర్ల వద్ద స్థిరపడింది.