న్యూఢిల్లీ, జూలై 13: పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లలో ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకుండా, మాస్కుల్లేకుండా గుంపులుగా తిరగడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ప్రజల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈశాన్య రాష్ర్టాల్లో కరోనా వ్యాప్తిపై అక్కడి సీఎంలతో మంగళవారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వైరస్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. థర్డ్వేవ్ ఇంకా రాలేదని, కేసులు పెరగకముందే ఎంజాయ్ చేద్దామని ప్రజలు భావించడం సరికాదని అన్నారు. ‘కరోనా దానంతట అది రాదు. అలాగే దానంతట అది పోదు’ అని పేర్కొన్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే అంతే..
ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇప్పటి వరకు చేసింది, సాధించింది అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే భవిష్యత్తు వేవ్లను కూడా నిరోధించవచ్చన్నారు.
పర్యాటకులను వెనక్కి పంపిన ఉత్తరాఖండ్
కరోనా థర్డ్వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి జరుగాల్సిన కావడ్ యాత్రను రద్దు చేసింది. ముస్సోరీ, నైనిటాల్కు వెళ్లిన పర్యాటకులను రాష్ట్ర పోలీసులు వెనక్కి పంపారు. సుమారు 8 వేల మంది పర్యాటకులను వెనక్కి పంపించినట్టు అధికారులు తెలిపారు. అంతేగాక పర్యాటక ప్రాంతాల్లో జనసమూహాలను నియంత్రించడానికి గాను బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక ప్రాంతాలకు వచ్చేవారు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
సెప్టెంబర్ నుంచి సీరంలో స్పుత్నిక్-వీ
పుణె, జూలై 13: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ ఉత్పత్తిని సెప్టెంబర్ నుంచి పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీరం) ప్రారంభించనుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సీఈవో కిరిల్ దిమిత్రేవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సీరంలో సంవత్సరానికి 300 మిలియన్ డోసుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దిమిత్రేవ్ తెలిపారు.