న్యూయార్క్, సెప్టెంబర్ 2: వరుస తుఫానులతో అమెరికా చిగురుటాకులా వణుకుతున్నది. వారం రోజుల క్రితం సంభవించిన హెన్రీ తుఫాను దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్ విరుచుకుపడింది. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ర్టాల్లో ఐడా తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రాష్ర్టాలు జలమయం అయ్యాయి. 14 మంది చనిపోయారు. రవాణా సేవలను పూర్తిగా నిలిపివేశారు. న్యూయార్క్ నగరంలో ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోగా వీరిలో రెండేండ్ల బాలుడు ఉన్నాడు. ఎడతెరిపి లేని వానలతో న్యూయార్క్, న్యూజెర్సీల్లో రోడ్లు, సబ్వేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ రెండు రాష్ర్టాల్లో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. నేషనల్ వెదర్ సర్వీస్ మొట్ట మొదటి సారి ఆకస్మిక వరద హెచ్చరికలను జారీ చేసింది. న్యూయార్క్లో బుధవారం రాత్రి రికార్డు స్థాయిలో ఒక్క గంటలోనే 9 సెంటీమీటర్ల వాన కురిసింది. తుఫాను క్రమంగా న్యూ ఇంగ్లండ్ వైపు కదులుతున్నది. ఈ క్రమంలో భారీ టోర్నడోలు సంభవించవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆఫ్రికా తీరంలో ఏర్పడిన లారీ తుఫాన్ బలపడి అమెరికా వైపునకు చురుగ్గా కదులుతున్నది.