చెన్నై: తమిళనాడులోని ఒక గ్రామంలో ఆదివారం చేపలు పట్టే పండుగ జరిగింది. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. శివగంగ జిల్లాలోని విలారిపట్టి గ్రామంలో ప్రతి ఏటా జూలై మొదటి వారంలో చేపల పట్టే పండుగను సాంప్రదాయంగా జరుపుకుంటారు. అయితే, కరోనా వల్ల విధించిన లాక్డౌన్ వల్ల గత ఏడాది ఈ వేడుకను రద్దు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ఆదివారం విలారిపట్టి గ్రామంలో ‘ఫిష్ క్యాచింగ్’ పండుగను భారీగా జరుపుకున్నారు. పరిసర గ్రామాలకు చెందిన వారు చెరువు వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చి చేపలు పట్టారు. అయితే ఈ వేడుకలో పాల్గొన్న వారు మాస్కులు ధరించకపోగా సామాజిక దూరాన్ని కూడా పాటించలేదు. దీంతో కరోనా నిబంధనల ఉల్లంఘనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.