న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర రూ.47 వేల మార్కును దాటింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.146 పెరిగి రూ.47,110కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం బంగారం ధర రూ.46,964 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరుగడమే దేశీయంగా బంగారం ధరలు పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.513 పెరిగి రూ.70,191కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.69,678 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,834 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి 27.20 అమెరికన్ డాలర్లు పలికింది.