కందుకూరు వాసికి దక్కిన అవకాశం
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక భూమిక
ప్రస్తుతం సీబీఐటీలో అధ్యాపకుడిగా విధులు
నిబద్ధతతో సేవలందిస్తా : బండి లింగారెడ్డి
ఖమ్మం, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖమ్మం జిల్లా వాసికి చోటు దక్కింది. వేంసూరు మండలం కందుకూరుకు చెందిన బండి లింగారెడ్డిని కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సీబీఐటీలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జిల్లావాసికి చోటు లభించింది. కమిషన్ సభ్యుడిగా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన బండి లింగారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ నేపథ్యం..
వేంసూరు మండలం కందుకూరుకు చెందిన బండి కృష్ణారెడ్డి, మంగతాయారు దంపతుల సంతానం లింగారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుం బం. లింగారెడ్డికి చిన్నప్పటి నుంచి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉండేది. అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు సభ్యుడిగా నియమితులయ య్యారు. ఆయన ఎన్నిక తోటి స్నేహితులు, గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగారెడ్డి కందుకూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, సత్తుపల్లి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉస్మానియాలో ఎమ్మెస్సీ పూర్తి అయిన తర్వాత అక్కడే పీహెచ్డీ చేశారు. 1996లో పీహెచ్డీ పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకుడిగా చేరారు. ఉద్యోగపరంగా బిజీగా ఉన్నా.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కూడగట్టడం, ఉద్యమాలు నిర్వహించడంలోనూ చురుకైన పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతోపాటు అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పలుమార్లు అరెస్టు అయ్యారు.
సీబీఐటీలో అధ్యాపకుడిగా..
లింగారెడ్డి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. 1996లో గండిపేటలోని సీబీఐటీలో అధ్యాపకుడిగా చేరారు. ప్రస్తుతం అదే కళాశాలలో ప్రొఫెసర్గా, హెచ్వోడీగా పనిచేస్తున్నారు. ఫిజిక్స్ సబ్జెక్టు బోధించడంలో ఆయన దిట్ట. అంతేకాదు, ఆ సబ్జెక్టులో పీహెచ్డీ చేశారు. ఆయనకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుతో సన్నిహిత సంబంధాలున్నాయి. హెటిరో డ్రగ్స్ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు బండి పార్థసారథి రెడ్డికి సమీప బంధువు. ఆయనకు సొంతూరిపై మమకారం ఎక్కువ. గ్రామస్తులతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తారు. గ్రామంలో అంతర్గత రహదారుల సమస్య ఉందని గ్రామస్తులు చెప్పిన వెంటనే స్పందించిన లింగారెడ్డి.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.