న్యూడిల్లీ : ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్ధాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం కేవలం 2.26 శాతంగా నమోదవడం విశేషం. ఇక ఈ ఏడాది జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.03 శాతంగా ఉంది.
గత నెలతో పోలిస్తే ఆహారోత్పత్తుల ధరలు, తయారీ వస్తువుల ధరలు చుక్కలు తాకడంతో ఈ రెండు ఉత్పత్తుల ధరలు వరుసగా 3.31 శాతం, 5.81 శాతం పెరిగాయి. ఆహారోత్పత్తుల్లో ఉల్లిగడ్డలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతోనూ సరఫరా వ్యయాలు భారమై నిత్యావసరాల ధరలు కొండెక్కాయని నిపుణులు పేర్కొంటున్నారు.