చెన్నై: కొత్తగా ఏర్పాటు చేసిన ఒక షాపు ఐదు పైసల నాణేం ఇస్తే బిర్యానీ ఉచితం అంటూ ప్రకటించింది. దీంతో వందలాది మంది జనం ఐదు పైసల నాణేలతో ఆ షాపు వద్దకు చేరారు. అయితే అంత మందికి ఉచితంగా బిర్యానీ ఇవ్వలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. తమిళనాడులోని మదురైలో ఈ ఘటన జరిగింది.
మదురైలోని సెల్లూర్ ప్రాంతంలో సుకన్య బిర్యానీ స్టాల్ను ఇటీవల ప్రారంభించారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో ఐదు పైసల నాణెం తెచ్చిన వారికి బిర్యానీ ఉచితం అని పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీనిని చూసిన స్థానికులు ఐదు పైసల నాణేలతో ఆ షాపు వద్ద క్యూ కట్టారు. 300 మందికిపైగా ఉన్న జనాన్ని చూసి ఆ షాపు నిర్వాహకులు చేతులెత్తేశారు. అంతమందికి ఉచితంగా బిర్యానీ అందించలేక షాపును మూసివేశారు.
మరోవైపు అక్కడకు వచ్చిన పోలీసులు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. మాస్క్ ధారణ, సామాజిక దూరం వంటి కరోనా నిబంధనలు పాటించకుండా షాపు వద్ద గుమిగూడిన వారిని మందలించి అక్కడి నుంచి పంపివేశారు. కాగా, ఐదు పైసలు తెస్తే ఉచితంగా బిర్యానీ అంటూ ప్రకటించి నిర్వాహకులు చేతులెత్తేయడంపై పలువురు మండిపడ్డారు.