డబుల్ బెడ్రూం ఇండ్లను మూడునెలల్లో లబ్ధిదారులకు అందించాలి
జిల్లాలో కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకణ్ రెడ్డి
కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
నిర్మల్ టౌన్, మార్చి 31 : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరుచేస్తున్నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతున్నదని, వేగంగా పూర్తిచేయాలని అధికారులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో బుధవారం అధికారులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారం నుంచి కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు మాస్కు, సామాజిక దూరంపై అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే జరిమానా విధించాలని ఆదేశించారు. ఈ యాసంగి సీజన్కు సంబంధించి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భైంసా, నిర్మల్, ఖానాపూర్ పట్టణాలతో పాటు ఆయా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి, మూడు నెలల్లో లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని, యాంత్రీకరణను ప్రోత్సహించాలని సూచించారు. నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులు ఆలస్యంగా సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. డీ1 పట్టాలు పొందిన రైతులకు రైతు బంధు రావడంలేదని, వెంటనే సమీక్షించి, అర్హులైన రైతులకు పట్టాలిప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో పని చేయాలి..
ప్రభుత్వం 30 శాతం ఫిట్మెంట్తో పాటు విరమణ వయస్సు పెంచడంపై జిల్లాలోని ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘంతో పాటు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు, విరమణ పొందుతూ లబ్ధిపొందిన అధికారులు మంత్రికి పూల మొక్కలు అందించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేసి, ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని మంత్రి కోరారు. మంత్రిని కలిసిన వారిలో గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, సంఘ నాయకులు కిరణ్కుమార్, సత్యనారాయణ, రమేశ్కుమార్, అంజిప్రసాద్, దేవేందర్, వెంకటేశ్వర్రావు, జయంత్రావుచౌహాన్, రమేశ్ రాథోడ్, శంకరయ్య, తుకారాం, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నది..
నిర్మల్ అర్బన్, మార్చి 31 : తెలంగాణ సర్కారు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నదని మంత్రి అల్లోల స్పష్టం చేశారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ సారి బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పీఆర్టీయూ అధ్యక్షుడు రమణారావు, ప్రధాన కార్యదర్శి నరేంద్ర బాబు, సుభాష్, భూమారెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, కేపీ రెడ్డి, శంకర్, శ్రీధర్ రెడ్డి, నర్సయ్య, లింగన్న, బాపు, సంజీవ్ రావు, స్వామి, రాఘవేందర్, సంజీవ్ పాల్గొన్నారు.