న్యూఢిల్లీ: త్వరలో హౌరా నుంచి ఢిల్లీకి 12 గంటల్లో రైలులో చేరవచ్చు. ఈ రైలు మార్గంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో హౌరా-ఢిల్లీ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ మేరకు 1,500 కిలోమీటర్ల మేర గ్రాండ్ కార్డ్ రైల్ సెక్షన్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేష్ కుమార్ తెలిపారు. రూ.6,975 కోట్ల వ్యయంతో ‘మిషన్ రాఫ్తార్’ కింద కొనసాగుతున్న ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత ఢిల్లీ, హౌరా మధ్య దూరాన్ని కేవలం 12 గంటల్లో కవర్ చేయవచ్చని చెప్పారు.
ఢిల్లీ- ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో రైలు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచే రెండు ప్రాజెక్టులకు 2019లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపిందని రాజేష్ కుమార్ తెలిపారు. భారత రైల్వే గోల్డెన్ క్వాడ్రిలేటరల్, డైయాగ్నల్స్లోని మొత్తం ప్రయాణీకుల రద్దీలో 52%, మొత్తం సరుకు రవాణాలో 58% ఈ రెండు కారిడార్స్ పరిధిలో ఉన్నాయని వివరించారు.