నిజామాబాద్ రూరల్, మే 13: ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో దశాబ్దాల తరబడి విలీనంగా ఉన్న గ్రామాలు నిధుల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి 500 జనాభా కలిగిన ప్రతి తండాకు ప్రత్యేకంగా పంచాయతీ హోదా కల్పించింది. ఫలితంగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి ద్వారా నేరుగా నిధులు మంజూరు కావడంతో ఆశించిన అభివృద్ధి కళ్లెదుట కొట్టొచ్చినట్లుగా కనిపించడంతో గ్రామస్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న గాంధీనగర్ తండాకు రెండేళ్ల క్రితం ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించింది. దీంతో గ్రామస్తులు సర్పంచ్గా బదావత్ అనూషతోపాటు 8మంది వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఐక్యతను చాటి ఆదర్శంగా నిలిచారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులు అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. దాతలు అందించిన సహకారంతో గ్రామంలోని ఆరు మట్టి రోడ్లపై మొరం వేసి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. 480 మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. రూ.5లక్షలతో రెండు చోట్లా సీసీ రోడ్లు వేయగా, మరో రూ.5.50 లక్షలతో సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులను పూర్తి చేశారు. రూ.9.20లక్షల నిధులతో ట్రాలీతో కూడిన ట్రాక్టర్ను, వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ట్రాక్టర్ ట్రాలీలో చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు, కంపోస్ట్ షెడ్డులకు తరలిస్తుండడంతో గ్రామం స్వచ్ఛతకు అద్దం పడుతోంది.
పల్లెప్రగతిలో భాగంగా గ్రామశివారులో రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. ఇక్కడ ఒక బోరు వేసి మోటరు బిగించారు. రూ.3లక్షలతో కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డులు నిర్మించారు. పల్లెప్రకృతివనంలో నాటిన 2వేల మొక్కలు ఏపుగా పెరిగి హరితశోభను సంతరించుకోవడంతోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మల్లారం క్లస్టర్ పేరిట మంజూరైన రైతువేదిక భవనాన్ని రూ.22లక్షలతో గాంధీనగర్ తండాలో నిర్మించారు. హరితహారం కింద నాటడానికి అవసరమైన 12వేల మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు.