మంత్రి కేటీఆర్ అసహనం
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ రేట్లు కేంద్రానికి ఒక రకంగా, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో రకంగా నిర్ణయించడంపై మంత్రి కే తారకరామారావు అసహనం వ్యక్తంచేశారు. దేశమంతా ఒక్కటే కదా.. మరి ధరల్లో వ్యత్యాసం ఎందుకని కేంద్రాన్ని నిలదీశారు. ‘ఒకే దేశం- ఒకే పన్ను (జీఎస్టీ)’ అంటే మేము సమ్మతించాం. మరిదేంటి.. ఒక దేశం-రెండు వేర్వేరు వ్యాక్సిన్ ధరలా!? కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 నిర్ణయించడమా? వ్యాక్సిన్ ధరల్లో ఉన్న తేడాను పీఎం కేర్స్ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం భరించలేదా? దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతానికి సాయం చేయలేదా?’ అని ప్రశ్నించారు.
వ్యాక్సినేషన్ విధానం మార్కెట్ పట్ల పక్షపాతంతో, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నది. సంక్షోభసమయం లో తయారీదారులు టీకాలతో వ్యాపారం చేయకూడదు. ప్రతి భారతీయుడికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలి.
కొవిడ్ టెస్టింగ్ కిట్లను, ఆక్సిజన్, రెమ్డెసివిర్ల ఎగుమతికి అనుమతించడం ద్వారా కేంద్రం తీవ్ర నేరం చేసింది. కరోనా ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి కేంద్రం వద్ద వ్యూహమే లేదు.
-కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
ప్రజలను కాపాడుకోవడానికి అవసరమైతే కేంద్రం కాళ్లు కూడా పట్టుకొంటాం.
-మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే
కరోనా పెరగడానికి మోదీదే బాధ్యత. మేనేజ్మెంట్లో ప్రపంచనిపుణుడిగా చెప్పుకొనే మోదీకి ఎంతసేపూ బెంగాల్, తమిళనాడు ఎన్నికలపైనే ధ్యాస.
-డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్