వివాదాస్పద బిల్లుకు లోక్సభ ఆమోదం
తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్, కాంగ్రెస్, ఎన్సీపీ
న్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీలో ప్రభుత్వం అంటే ‘లెఫ్టినెంట్ గవర్నరే’ అని పేర్కొనే ‘జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశికప్రాంతం (సవరణ) బిల్లు, 2021’ (జీఎన్సీటీడీ సవరణ బిల్లు)… ఆమ్ఆద్మీపార్టీ (ఆప్), కాంగ్రెస్ సభ్యుల తీవ్ర నిరసనల మధ్య లోక్సభలో సోమవారం ఆమోదం పొందింది. ఈ బిల్లు.. రాజ్యాంగ విరుద్ధమని, మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆప్, కాంగ్రెస్ మండిపడగా… ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాల్లో అస్పష్టతను, గందరగోళాన్ని తొలగించేందుకు ఈ బిల్లు అవసరమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి సమర్థించుకున్నారు. ఈ బిల్లు ప్రకారం ఎలాంటి పరిపాలనాపరమైన చర్యలకైనా ఎల్జీ అభిప్రాయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. లోక్సభలో ఈ బిల్లుపై వాడి వేడిగా చర్చ జరిగింది. కిషన్రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వ పరిపాలనా అంశాలను లెఫ్టినెంట్ గవర్నర్కు తెలియజేయాలని కోర్టు ఆదేశించడంతో 1991లో జీఎన్సీటీడీ చట్టాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని, పరిమిత శాసనాధికారాలు గల అసెంబ్లీతో ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆప్ ఎంపీ భగవంత్మన్ మాట్లాడుతూ రాష్ర్టాల హక్కులను లాగేసుకోవడంలో బీజేపీ ‘స్పెషలిస్ట్’ అని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ నిర్ణయాలను అడ్డుకోవడమే ఈ బిల్లు లక్ష్యమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆరోపించారు. ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సూచించారు.
ఢిల్లీ ప్రజల తీర్పును అవమానించడమే: కేజ్రీవాల్
లెఫ్టినెంట్ గవర్నర్కు సర్వాధికారాలు కట్టబెట్టే బిల్లును కేంద్ర ప్రభుత్వం తేవడం ఢిల్లీ ప్రజలకు అవమానమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ బిల్లు ప్రజలు ఎన్నుకొన్న వారి నుంచి అధికారాలు లాక్కొని, ఓడించిన వారికి అప్పగిస్తుందని ఆయన విమర్శించారు.