తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలికి సిరా వేయనున్నారు. ఈ మధ్యే ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఎడమ చూపుడు వేలికి సిరా పూశారు. ఆ సిరా గుర్తు ఇంకా పోకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలు జారీచేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి లోక్సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ స్థానానికి వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది.
ప్రతి ఎన్నికల్లో ఓటేసే ఓటరుకు అధికారులు ఎడమచేతి చూపుడు వేలికి సిరా వేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఓటర్ల ఎడమచేతి వేలికి వేసిన ఇండెలిబుల్ సిరా ఇంకా కొందరికి చెరిగిపోలేదు. అలాంటివారు ఓటు వేసేందుకు వెళితే పోలింగ్ అధికారులు వెనక్కుపంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కుడి చేతి చూపుడు వేలికి సిరా వేయాలని సీఈసీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.